ఎందుకోగాని ఈ రోజుల్లో జనాలకి భక్తి ఎక్కువయింది.ఏ గుడి చూసినా ఏ రోజైనా
కిటకిటలాడుతున్నాయి. దేవాలయాలే కాదు, ప్రతి పేవ్మెంట్ పైనా అడుగడుగునా
ప్రత్యక్షమయ్యే గుళ్ళ దగ్గరా దండాలెడుతూ జనం కనిపిస్తున్నారు.దేవాలయం అంటే
ఓ పవిత్ర ప్రదేశం.ట్రాఫిక్ రొదల్తో, రోడ్డు మీద నడుస్తూ ఉమ్ములేస్తూ తిరిగే చోట
ఇలా గుళ్ళు కట్టడం,అక్కడ పూజలు, భజనలూ చేయడం ఎంతవరకు సమంజసం
అంటారు? ఇక రోడ్డు మీద అడ్డ దిడ్డంగా తిరుగుతూ ఆవులు అగుపిస్తాయి.మఖ్యంగా
మన కార్పొరేషన్ వారి చెత్తకుండీల దగ్గర.వాటి యజమానులు వాటి పాలను పిండుకొని
రోడ్డు మీదకు తోలతారు.మనకు ఆవు గోమాత కాబట్టి అలా పేపర్లు,ప్లాస్టిక్ కవర్లలోని
కూరగయ చెక్కుల్ని తింటూ కనిపించగానే తోక దగ్గర చేతులుంచి దండాలు పెట్టే భక్తులు
అగుపిస్తారు. మన నమ్మకం మంచిదే, అలానే ఆ ఆవు నోటికి కూడా ఓ అరటి పండు
ప్రసాదంగా అందిస్తే మంచిదని మాత్రం తోచదు. మా చిన్నప్పుడు రాజమండ్రిలో ఆదినారాయణ
గారని గుర్తు. పచ్చ గడ్డి కట్టలు తెచ్చి ఓ కూడలిలో వేసే వారు. ఆయన గొంతు వినగానే
ఎక్కడెక్కడి ఆవులూ వచ్చేవి.అప్పుడు ఇంత మీడియా లేదు కాబట్టి అందరికీ తెలిసే అవకాశం
లేక పోయేది.ఇక బైక్ మీద వెలుతూ ఏ సందులోనో దూరంగా వుండే గుడి కనబడగానే
ఆ వైపు కళ్ళు మూసుకొని వేళ్ళ మీద నున్న ఉంగరాన్ని ముద్దు పెట్టుకొనే భక్తులు చాలా
మందిని మీరు చూసే ఉంటారు.గుడిలో వెలితే క్యూలో వున్న స్త్రీలను,పిల్లలను తోసేసి ముందుకు
వేళ్ళే భక్తుల్ని చూస్తాం.కనీసం దేముని దగ్గరైనా మంచిగా ప్రవర్తించరు.అక్కడ కూడా రాజకీయాల
గురించి, సినిమాల గురించి,పెద్దగా మాట్లాడుతుంటారు.బజార్లో మారనివి,నకిలీవి దేముడు మనల్ని
అడగడు అన్న ధైర్యంతో హుండీలలో వెయ్యడం ఈ మధ్య ఎక్కువయింది.ఈ నకిలీ నోట్ల బాధ
ఏడుకొండలవాడికే తప్పటం లేదని ఈ మధ్యే వార్తల్లో వినిపిస్తున్నది.సాధ్యమైనంత వరకు మంచిగా
వుంటూ , మూగ జీవులకు ఆహారం అందిస్తు ఉండటమే నిజమైన మాధవ సేవ అని మన పెద్దలు
ఏ నాడో చెప్పారు.దేవాలయళ్ళో రద్దీగా వున్నప్పుడు పెద్దవాళ్ళను,పిల్లలూ,స్త్రీలను ముందుగా వెళ్ళే
టట్లు సహాయం చేయడం లాంటి పనులు అలవాటు చేసుకొంటే అదే భగవంతునికి నిజమైన నివాళి.
